అమరావతి: నాబార్డ్ వార్షిక రుణ ప్రణాళికపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్షించారు. బుధవారం ఆయన తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష చేపట్టారు. కొవిడ్ వంటి పరిస్థితులు ఉన్నప్పటికీ వ్యవసాయరంగం మద్దతుగా నిలిచిందని చెప్పారు. పలు కార్యక్రమాలకు నాబార్డ్, ఇతర బ్యాంకులు సహాయపడుతున్నాయన్నారు. వ్యవసాయరంగాన్ని మరింత లాభదాయకంగా తీర్చిదిద్దేందుకు భవిష్యత్ టెక్నాలజీని వాడుకోవడంపై దృష్టిసారించినట్లు వెల్లడించారు.
రైతు భరోసా, సున్నా వడ్డీకి రుణాలు, ఉచిత పంటల బీమా అమలుచేస్తున్నాట్లు సీఎం జగన్ తెలిపారు. గ్రామీణ నియోజకవర్గాల స్థాయిలో అగ్రిల్యబ్స్ ఏర్పాటు చేశామని, సహకార బ్యాంకులు, సొసైటీలను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఆర్బీకేల స్థాయిలో డ్రోన్లను తీసుకువచ్చేందుకు యోచిస్తున్నామని, వ్యవసాయరంగంలో భవిష్యత్ టెక్నాలజీపై దృష్టిపెడుతున్నట్లు వెల్లడించారు. రాయలసీమలో కరవు నివారణకు చర్యలు చేపట్టినట్లు స్పష్టం చేశారు.
పార్లమెంట్ నియోజకవర్గాల స్థాయిలో ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నట్లు జగన్ చెప్పారు. రైతుల ఉత్పత్తులకు అదనపు విలువను జోడించేందుకే ఈ కార్యక్రమాలను చేపడుతున్నట్లు వెల్లడించారు. నాణ్యమైన విద్యను అందించడంపై ప్రత్యేక దృష్టిపెట్టామని చెప్పిన జగన్.. భవిష్యత్లో గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఈ చిన్నారులే ప్రధానపాత్ర పోషించే స్థాయికి ఎదుగుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. మత్స్యకారులు వలస వెల్లకుండా నిరోధించేందుకు రాష్ట్రంలో హార్బర్లు, పోర్టులు, ఫిష్ల్యాండింగ్ సెంటర్లను నెలకొల్పే పనులను ప్రారంభించామని తెలిపారు. ఈ సమీక్షకు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నాబార్డ్ చైర్మన్ జీఆర్ చింతల, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.