తిరుపతి : నాగలాపురం శ్రీ వేద నారాయణ స్వామివారి ఆలయంలో ఈనెల 21న పుష్పయాగ మహోత్సవం నిర్వహించనున్నారు. ఇందుకోసం శుక్రవారం సాయంత్రం 6.15 నుంచి రాత్రి 7.45 గంటల వరకు పుణ్యాహవచనం, రక్షాబంధనం, మృత్సంగ్రాహణం, సేనాధిపతి ఉత్సవం, పుష్పయాగానికి అంకురార్పణ నిర్వహిస్తారని టీటీడీ అధికారులు తెలిపారు. 21న ఉదయం 11 గంటలకు స్నపనతిరుమంజనం, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు వేడుకగా పుష్పయాగం నిర్వహిస్తామన్నారు.
ఈ సందర్భంగా పలురకాల పుష్పాలు, పత్రాలతో స్వామివారికి అభిషేకం ఉంటుందని, రాత్రి 7 నుంచి 8.30 గంటల వరకు వీధి ఉత్సవం నిర్వహిస్తున్నామని వెల్లడించారు. గృహస్తులు ఇద్దరు రూ.750 టికెట్ కొనుగోలుచేసి పుష్పయాగంలో పాల్గొనవచ్చని తెలిపారు. ఈ ఆలయంలో ఏప్రిల్ 16 నుంచి 24వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో గానీ, నిత్యకైంకర్యాల్లో గానీ అర్చక పరిచారకుల వల్ల, అధికార అనధికారుల వల్ల, భక్తుల వల్ల తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారని అర్చకులు తెలిపారు.