అమరావతి : వరద బాధితులను ఆదుకునే చర్యలను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ ప్రభుత్వానికి సూచించారు. ముందస్తు చర్యల ద్వారా ప్రజల ఆస్తి, ప్రాణ నష్టాన్ని తగ్గించగలమని పేర్కొన్నారు. వరద బాధితులకు టీడీపీ శ్రేణులు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. వరద బాధితులకు ప్రభుత్వం ఉందనే భరోసా కల్పించాలన్నారు.
వరదలతో 6 జిల్లాలోని 525కు పైగా గ్రామాల్లో జనజీవనం అస్తవ్యస్తంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. లంక, పోలవరం ముంపు గ్రామాల ప్రజలను ఆదుకోవాలని కోరారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో పాటు ఎగువన నుంచి వస్తున్న నీటితో గోదావరికి వరద ఉద్ధృతి పెరుగుతుంది. దీంతో కోనసీమ జిల్లాలోని లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. గ్రామాల చుట్టూ వరద నీరు ఉండడంతో రోజువారీ జీవనానికి ఆటంకాలు ఏర్పడుతున్నాయి.
కనీస అవసరాల కోసం మర పడవలపై ప్రమాదకర ప్రయాణాలు చేస్తున్నారు. అనేక గ్రామాలకు మార్గమధ్యంలో ఉన్న వాగులు, వంకలు పొంగిపొర్లుతుండడంతో రాకపోకలు స్థంభించిపోయాయి.