అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే ఏడాదికి మరో 5 వైద్య కళాశాలలు అందుబాటులోకి రానున్నాయి. ఈ వైద్య కళాశాలల ప్రారంభంతో వచ్చే విద్యా సంవత్సరం నుంచి దాదాపు 750 సీట్లు పెరగనున్నాయి. రేపటి నుంచి ఈ కాలేజీలు ఎన్ఎంసీకి దరఖాస్తు చేసేందుకు సర్వం సిద్ధం చేసుకున్నాయి. ప్రస్తుతం జిల్లా ఆసుపత్రుల్లో ఈ వైద్య కళాశాలలు ప్రారంభిస్తుండటంతో వాటిని బోధనాసుపత్రులు మార్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.
వచ్చే విద్యాసంవత్సరం నుంచి రాష్ట్రంలో మరో 5 మెడికల్ కాలేజీలు రానున్నాయి. ఏలూరు, విజయనగరం, రాజమండ్రి, నంద్యాల, మచిలీపట్నంలలో కొత్త మెడికల్ కాలేజీలకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యా కార్యకలాపాలు నిర్వహించేందుకు ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం అనుమతి ఇచ్చింది. దీంతో ఒక్కో కాలేజీలో 150 ఎంబీబీఎస్ సీట్లతో అకడమిక్ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఆయా కళాశాలలకు ప్రిన్సిపాల్స్, సూపరింటెండెంట్లను నియమించారు.
కాగా, ఇప్పటి వరకు ఉన్న జిల్లా ఆసుపత్రులను బోధనాసుపత్రులుగా మారుస్తున్నారు. యూనివర్సిటీ అఫిలియేషన్ నేపథ్యంలో ఆయా కళాశాలలు రేపటి నుంచి జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ)కి దరఖాస్తు చేయనున్నట్లు ఏపీ వైద్య విద్య డైరెక్టర్ (డీఎంఈ) డాక్టర్ రాఘవేంద్రరావు తెలిపారు. కాగా, వైద్య, ఆరోగ్య శాఖలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన జగన్ ప్రభుత్వం.. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒకటి చొప్పున 16 కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నది. ఇందులో భాగంగానే వచ్చే ఏడాది ఐదు కళాశాలలు ప్రారంభం కానున్నాయి. తద్వారా ప్రస్తుతం ఉన్న సీట్లకు అదనంగా 750 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి.