అమరావతి : ఎన్నికలు ముగిసి అధికారంలోకి వచ్చిన తరువాత వాలంటీర్ల (Volunteers) వ్యవస్థ పునరుద్ధరణపై తొలిసంతకం చేస్తానని ఏపీ సీఎం వైఎస్ జగన్ ( AP CM Jagan) ప్రకటించారు. ప్రకాశం జిల్లాలో కొనసాగుతున్న మేమంతా సిద్ధం బస్సుయాత్ర సందర్భంగా పింఛన్దారుల (Pensioners) తో నిర్వహించిన ముఖాముఖిలో మాట్లాడారు.
ఎన్నికల లబ్ది కోసం అబద్దపు మాటలతో మోసం చేసే నాయకులను ప్రజలెవ్వరూ నమ్మవద్దని కోరారు. చంద్రబాబు (Chandra Babu) కూటమి నోటికొచ్చిన అబద్ధాలతో ప్రజల వద్దకు వస్తున్నారని వారితో జాగ్రత్తగా ఉండాలని కోరారు. చంద్రబాబుకు ఓటేస్తే పులినోట్లో తలపెట్టినట్టేనని పేర్కొన్నారు.
జనాభా ప్రకారం అత్యధిక పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని వెల్లడించారు. నెలకు రూ. 2వేల కోట్లు పెన్షన్లుకే ఇస్తున్నామని అన్నారు. పింఛన్దారులు ఇబ్బందులు పడకుండా ఇంటివద్దకే వచ్చి డబ్బు ఇచ్చేందుకు వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చామని స్పష్టం చేశారు. మరోసారి అధికారంలోకి వచ్చిన తరువాత వాలంటీర్ వ్యవస్థను మరింత పటిష్టపరుస్తామని చెప్పారు. ఏనాడు కూడా పేదల గురించి ఆలోచించని చంద్రబాబుకు ఓటేసి మోసపోవద్దని సూచించారు.