అనంతపురం: ఏపీలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియలో భాగంగా వచ్చే నెల 3వ తేదీ వరకు ప్రజల నుంచి అభ్యంతరాలు, సలహాలు, సూచనలు తీసుకుంటామని ఏపీ ప్రణాళికా శాఖ కార్యదర్శి విజయ్ కుమార్ పేర్కొన్నారు. అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో శనివారం జిల్లాల పునర్వ్యవస్థీకరణ అంశంపై అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాలకు చెందిన కలెక్టర్లు, కడప జిల్లాకు చెందిన జాయింట్ కలెక్టర్తో సమావేశం నిర్వహించారు. అనంతరం విజయ్కుమార్ మీడియాతో మాట్లాడారు.
జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ ముమ్మరంగా సాగుతున్నదని విజయ్కుమార్ తెలిపారు. దానిలో భాగంగా అనంతపురంలో నాలుగు జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో సమావేశం నిర్వహించి ఇప్పటివరకు అందిన అభ్యంతరాలు, సలహాలు మీద చర్చించామన్నారు. ఇక్కడి ప్రజల ఆలోచనలు, ఆకాంక్షలు ఏ విధంగా ఉన్నాయి..? జిల్లాల పునర్వ్యవస్థీకరణపై ప్రజల స్పందన ఏ విధంగా ఉంది..? వారు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు..? అనేది తెలుసుకుంటున్నట్లు చెప్పారు. ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలు, సూచనలను కలెక్టర్లు నివేదిక రూపంలో ప్రభుత్వానికి అందిస్తారని, ప్రతి అంశంపై ప్రభుత్వం మరోసారి చర్చించి నిర్ణయం తీసుకుని తుది నోటిఫికేషన్ ఇస్తుందని వెల్లడించారు. తుది నోటిఫికేషన్ వచ్చిన అనంతరం జిల్లాలు ఏ రోజు నుంచి ఆవిర్భవిస్తాయనేది తుది నోటిఫికేషన్లో తెలియజేస్తామని పేర్కొన్నారు. ప్రతి కొత్త జిల్లాలో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లను నిర్మించాలన్నది సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆలోచన అని, దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారన్నారు.
ఉద్యోగుల విభజన నూతన ప్రక్రియ ప్రకారం జరుగుతుందని విజయ్ కుమార్ తెలిపారు. విధులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ఉద్యోగులు పనిచేసేందుకు ఆర్డర్ టు సర్వ్ ఇవ్వడం జరుగుతుందన్నారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియలో జోన్ల ఏర్పాటులో పెద్దగా ఇబ్బంది లేదని, రాష్ట్ర స్థాయి ఉద్యోగులకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేదని, జోనల్ స్థాయిలో కూడా ఒకటి రెండు చోట్ల తప్ప ఎక్కువ ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. రాయలసీమ నాలుగు జిల్లాలకు సంబంధించి దాదాపు 1600 కుపైగా అభ్యంతరాలు వచ్చాయని తెలిపారు. చారిత్రాత్మక భావాలు, సాంస్కృతిక పరమైన అనుబంధాలు, ఆర్థిక పరమైన అభివృద్ధి వంటి అన్ని రకాల కారణాలు, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని తుది నిర్ణయం ఉంటుందని వెల్లడించారు. ఈ సమావేశంలో అనంతపురం కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి, కర్నూలు కలెక్టర్ పీ కోటేశ్వరరావు, చిత్తూరు కలెక్టర్ ఎం హరినారాయణన్, కడప జాయింట్ కలెక్టర్ గౌతమి తదితరులు పాల్గొన్నారు.