అమరావతి : మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పై సినీ నటుడు శివాజీ మరోసారి ఫైర్ అయ్యారు. టీడీపీ హయాంలో మద్యం అమ్మకాలపై విమర్శలు చేసిన ఉండవల్లి నేడు ఆంధ్రప్రదేశ్లో మద్యం ధరలపై ఎందుకు పెదవి విప్పడం లేదని ప్రశ్నించారు. ఉండవల్లి ముఖ్యమంత్రి జగన్ భజన చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ పాలనలో ఏపీ అప్పుల ఊబిలో కూరుకుపోయిందని ఆయన ఆరోపించారు. ఏపీని అప్పులపాలు చేసిన జగన్ కు ప్రజలు బుద్ధి చెప్పాలని కోరారు.
ప్రజలు పోరాటాలకు సిద్ధంగా ఉన్నప్పుడే రాజకీయ నాయకులు అవినీతి, అప్పులు లేకుండా పరిపాలిస్తారని చెప్పారు. ఇదే సమయంలో జనసేనాని పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి కూడా శివాజీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు.
మాజీ ఐఏఎస్ అధికారులను కాకుండా పార్టీ నేతలను, కార్యకర్తలను నమ్ముకుంటే మంచిదని హితవు పలికారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు మంచి, చెడ్డలను ఆలోచించి ఓట్లు వేయాలని అన్నారు.