విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు గత ఏడాదితో పోలిస్తే 19 శాతం పెరిగాయి. ఈ విషయాన్ని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తన తాజా నివేదికలో వెల్లడించింది. దేశంలోనే రైతుల ఆత్మహత్యల్లో ఏపీ మూడో స్థానంలో నిలిచింది. ఇలా మూడో స్థానంలో నిలువడం వరుసగా ఇది మూడోసారి.
ఎన్సీఆర్బీ అందించిన గణాంకాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఏడాది మొత్తం మీద వ్యవసాయ రంగానికి చెందిన 1,065 మంది తమ జీవితాలను ముగించారు. 2020లో ఈ సంఖ్య 889 గా ఉన్నది. అంటే.. ఆత్మహత్యల్లో 19 శాతం పెరుగుదల కనిపిస్తున్నది. రైతుల ఆత్మహత్యల్లో 4,064 మందితో మహారాష్ట్ర, 2,169 మందితో కర్ణాటక రాష్ట్రాలు తొలి, రెండు స్థానాలను ఆక్రమించుకున్నాయి. 2020తో పోలిస్తే 2021 లో ఆంధ్రప్రదేశ్లో ఆత్మహత్యలు 14.5 శాతం పెరిగాయి. 2021లో మొత్తం 8,067 మంది ఆత్మహత్యలు చేసుకోగా, 2020లో ఆ సంఖ్య 7043 గా ఉన్నది. 2021లో రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న 1,065 మంది రైతుల్లో 958 మంది పురుషులు, 107 మంది మహిళలు ఉన్నారు.
మానవ హక్కుల ఫోరం (హెచ్ఆర్ఎఫ్), రైతు స్వరాజ్య వేదిక (ఆర్ఎస్వీ) ప్రతినిధులు రాష్ట్రంలోని అనేక ప్రాంతాలను సందర్శించి.. పెరుగుతున్న అప్పులు, వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్ ధర లేకపోవడం, కౌలుదారుకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను విడుదల చేయకపోవడం వంటి అంశాలే రైతుల ఆత్మహత్యలకు ప్రధాన కారణమని గుర్తించారు. కాగా, ఏపీ సర్కార్ 2019 అక్టోబర్లో ప్రారంభించిన రైతు భరోసా పథకం రైతుల్లో నిరాశను తగ్గించడంలో విఫలం చెందిందని తేల్చారు. వ్యవసాయ సంక్షోభానికి ముగింపు పలికేందుకు సరైన యంత్రాంగాన్ని సిద్ధం చేయాలని వీరు ప్రభుత్వానికి సూచించారు.