AP News | ప్రతి రోజూ వంటింట్లో ఉల్లి వాడుతుంటాం. కూరల్లో వాడేందుకు తరుగుతున్నప్పుడు కన్నీరు వస్తుంది. కానీ ఇప్పుడు రైతులకు కన్నీరు పెట్టిస్తున్నది. మార్కెట్లో ఒక్కసారిగా ఉల్లిగడ్డ ధర పడిపోయింది. దీంతో ఆరుగాలం కష్టపడి సాగు చేసిన ఉల్లి పంటకు గిట్టుబాటు ధర లభించకపోవడంతో ఆగ్రహించిన ఓ అన్నదాత తన ఉల్లిగడ్డలకు నిప్పు పెట్టిన ఘటన ఆంధ్రప్రదేశ్లోని కర్నూల్ జిల్లాలో జరిగింది.
పంచ లింగాలకు చెందిన వెంకటేశ్వర్లు అనే రైతు శనివారం కర్నూల్ వ్యవసాయ మార్కెట్కు ఉల్లిగడ్డ తీసుకొచ్చాడు. ఈ-నామ్ పద్దతిలో క్వింటాల్ ఉల్లికి రూ.350 రావడంతో అన్నదాత ఆగ్రహం కట్టలు తెంచుకున్నది. ఉల్లి బస్తాలపై వెంకటేశ్వర్లు పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు.
ఈ ఘటనపై మార్కెటింగ్శాఖ అధికారులు స్పందించారు. క్వింటాల్కు రూ.700 ఇప్పిస్తామని ప్రకటించడంతో అన్నదాతలు శాంతించారు. మార్కెట్లలో వ్యాపారులు, అధికారుల తీరు వల్ల కనీసం ఉల్లి పంటకు పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.