Srisailam | అత్యంత మహిమాన్వితమైన శివానుగ్రహం పొందడానికి భక్తులు చిత్తశుద్దితో కలిగిన ప్రేమతో శివారాధన చేయాలని ప్రముఖ ప్రవచనకర్త జిల్లెళ్ళమూడి గణేష్ అన్నారు. గురువారం ఆలయ మాడవీధిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో శివలీలల విశేషాలను భక్తులకు వివరించారు. ఈవో పెద్దిరాజు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో శ్రీశైల క్షేత్ర ఆధ్యాత్మిక విషయాలను తెలియజేశారు. శివానుగ్రహప్రాప్తి పొందడం ఎంతో సులభమని తెలిపారు.
వేల సంవత్సరాల క్రితం నుండి కూడా మునులు, ఋషులు సాధకులకు అనువైన క్షేత్రం శ్రీశైలమని జిల్లెళ్ళమూడి గణేష్ అన్నారు. అంతేకాకుండా జ్యోతిర్లింగం, శక్తిపీఠం కలిసి ఉన్న ఏకైక క్షేత్రం శ్రీశైలానికి దేశ విదేశాల నుండి వస్తున్న యాత్రికులు చెంబెడు నీళ్లతో ఆయనకు అభిషేకించుకునే అవకాశం దేవస్థానం కల్పిస్తున్నట్లు చెప్పారు. శివుడ్ని ఆనందింపజేసే నిగూఢాలను తెలిపేదే శివానందలహరి అని భక్తుల సందేహాలను కూడా నివృత్తి చేశారు.