అమరావతి : ఏపీలో పీఆర్సీ వివాదం ముదురుతుంది . ఉద్యోగ సంఘాలు ఒకవైపు ప్రభుత్వం మరోవైపు పట్టుదలను కొనసాగిస్తున్నారు. ఈ దశలో ప్రభుత్వం ఈరోజు కొత్త పీఆర్సీకి సంబంధించిన జీవో ప్రకారం జీతాలు, పెన్షన్ బిల్లులను ప్రాసెస్ చేయాలని సర్క్యూలర్ను జారీ చేసింది.
నిర్దేశిత గడువులోగా బిల్లులు ప్రాసెస్ చేయకుంటే క్రమ శిక్షణా చర్యలు తప్పవని సంబంధిత ట్రెజరీ, పే అండ్ అకౌంట్ విభాగాలకు హెచ్చరికలు జారీ చేసింది. పీఆర్సీ విషయంలో ఈ రెండు శాఖలు పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆందోళనలతో భాగస్వామ్యం అవుతున్నాయి. ఇవాళ సాయంత్రంలోగా బిల్లులను అప్లోడ్ చేయాలని డీడీఓలు, పీఏఓలు, ట్రెజరీ అధికారులకు ఆర్థిక శాఖ ఆదేశించింది. రేపటిలోగా అప్లోడ్ చేసిన బిల్లులను ప్రాసెస్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఫిబ్రవరి 1న జీతాలు జమయ్యేలా చూడాలని ట్రైజరీ అధికారులకు సర్క్యూలర్ను జారీ చేసింది .