Tirumala | హైదరాబాద్, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ): తిరుమలలో అక్రమాల నివారణకు మార్చి 1 నుంచి ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీని టీటీడీ అందుబాటులోకి తేనున్నది. శ్రీవారి సర్వదర్శనం, లడ్డూప్రసాదం, గదుల కేటాయింపు, రిఫండ్ చెల్లింపు తదితర అం శాల్లో మరింత పారదర్శకతను పెంచేందుకు వీలుగా దీనిని ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నది. సర్వదర్శనం కాంప్లెక్స్లో ఒకే వ్యక్తి అధిక లడ్డూ టోకెన్లు పొందకుండా, గదుల కేటాయింపు కేం ద్రాలు, కాషన్ డిపాజిట్ కౌంటర్ల వద్ద ఈ టెక్నాలజీని వినియోగంలోకి తీసుకురానున్నట్టు టీటీడీ అధికారులు తెలిపారు.
మార్చిలో మూడు ఆలయాల బ్రహ్మోత్సవాలు
అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఉపమాక గ్రామంలోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో మార్చి 2 నుంచి 10వ తేదీ వరకు జరుగనున్న వార్షిక కల్యాణోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని టీటీడీ జేఈవో వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు. ఉత్సవ ఏర్పాట్లపై ఆయన వర్చువల్ సమావేశం నిర్వహించారు. మార్చి 3న జరిగే కల్యాణోత్సవానికి విశేషంగా భక్తులు వస్తారని తెలిపారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం అనంతవరంలో మార్చి 4 నుంచి 8 వరకు, తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో మార్చి 2 నుంచి 8 వరకు జరుగనున్న వేంకటేశ్వరస్వామి ఆలయాల బ్రహ్మోత్సవాలకు కూడా తగిన ఏర్పాట్లు చేయాలని జేఈవో ఆదేశించారు.