అమరావతి : ఆంధ్రప్రదేశ్ లో మద్యం వ్యాపారంలో ప్రజాధనం దోపిడీకి గురవుతుందని టీడీపీ నాయకుడు బొండా ఉమ ఆరోపించారు. మద్యం వ్యాపారాన్ని అడ్డుపెట్టుకుని వైసీపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలకు పాల్పడుతుందని దుయ్యబట్టారు. రూ. 15 లకే దొరికే మద్యంను రూ. 200కు విక్రయిస్తున్నారని విమర్శించారు. గత టీడీపీ హయాంలో మద్యం విక్రయాలను పారదర్శకంగా, బహిరంగంగా విక్రయించామని తెలిపారు. అయితే ఈ ప్రభుత్వం బేవరేజెస్ నుంచి ఎంతకు కొంటున్నారో బయటకు రాదని తెలిపారు.
మద్యం దుకాణాల్లో ఆన్లైన్ చెల్లింపులు కాకుండా నగదు మాత్రమే తీసుకుంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వం వద్దకు నగదు రూపేణా మొత్తం జమ అవుతుందని వివరించారు. అదాని డిస్టిలరీ రాష్ట్రంలో మూడువేల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నదని ఈ డిస్టిలరీ ఎవరిదో వెల్లడించాలని డిమాండ్ చేశారు. అదాని కంపెనీ వైసీపీ నాయకులదని , బినామీపేర్లతో కంపెనీని నడిపిస్తున్నారని ఆరోపించారు.
ప్రభుత్వం అమ్ముతున్న మద్యంలో రసాయనాల శాతం అధికంగా ఉందని ల్యాబ్ రిపోర్ట్ తేల్చి చెప్పిందని వెల్లడించారు. ఇటీవల ఏపీలో నిర్వహించిన మద్యం దుకాణాల వేలం బోగస్ అని అన్నారు. విజయవాడలో ముగ్గురు వైసీపీ నాయకులు సిండికేట్గా దుకాణాలను స్వాధీనం చేసుకున్నారని ఆరోపించారు.