తిరుమల : వేసవి సెలవుల్లో(Summer Holidays) తిరుమల(Tirumala Temple) శ్రీవారి దర్శనార్థం కోసం వచ్చే భక్తుల సంఖ్యకు అనుగుణంగా మరింత మెరుగైన సేవలందించేందుకు సన్నద్ధంకావాలని టీటీడీ(TTD) ఈవో ఎవి ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుమలలోని అన్నమయ్యభవనంలో సీనియర్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు.
మే 1 నుంచి జులై 15వ తేదీ వరకు యాత్రికుల అవసరాలను తీర్చడానికి సంబంధిత విభాగాల అధికారులు 24 గంటలు తిరుమలలో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. డిప్యూటేషన్పై వచ్చే సంబంధిత అధికారులకు విధులు కేటాయించిన ప్రాంతాలను నిశితంగా పరిశీలిస్తూ, సమస్యలు ఏవైనా ఉత్పన్నం అయితే వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. క్యూ లైన్లు(Que Lines), వైకుంఠం కాంప్లెక్స్లు, కంపార్ట్మెంట్లలో తాగు నీరు, అన్నప్రసాదం తదితర సేవలకు ఎలాంటి లోటు లేకుండా చూడాలని కోరారు.
భక్తుల రద్దీకి తగినన్ని లడ్డూలు నిల్వ ఉంచుకోవాలన్నారు. మరుగుదొడ్లు ఎప్పటికప్పుడు శుభ్రం చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. కల్యాణకట్ట, సీఆర్వో, పీఏసీల వద్ద ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. అవసరమైన ప్రాంతాలలో ఆదనపు సిబ్బందిని ఏర్పాటు చేయాలన్నారు. ట్రాఫిక్(Traffic) రద్దీ, పార్కింగ్ సమస్య లేకుండా చూడాలని సూచించారు. ఈ సమావేశంలో సీవీఎస్వో నరసింహకిషోర్, సీఈ నాగేశ్వరరావు, తిరుమల ఏఎస్పీ మునిరామయ్య, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, ఇతర విభాగాధిపతులు పాల్గొన్నారు.