అమరావతి : మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు(Ex-minister Gollapally Surya Rao ) టీడీపీ(TDP) కి రాజీనామా చేసిన వైసీపీలో చేరారు. బుధవారం ఏపీ సీఎం వైఎస్ జగన్ సమక్షంలో ఆ పార్టీ కండువాను కప్పుకున్నారు. ఇటీవల టీడీపీ, జనసేన ప్రకటించిన ఉమ్మడి ఎమ్మెల్యేల అభ్యర్థుల జాబితాలో గొల్లపల్లి పేరు లేకపోవడంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. పొత్తులో భాగంగా రాజోలు సీటును టీడీపీ జనసేనకు కేటాయించింది.
ఈ సందర్భంగా ఆయన చంద్రబాబుకు లేఖ రాశారు. కష్టకాలంలో పార్టీ కోసం పనిచేశానని, తనకు రాజోలులో సీటు ఇవ్వకుండా అవమానించారని పేర్కొన్నారు. 2019 నుంచి టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా, రాజోలు నియోజకవర్గ ఇన్చార్జిగా ప్రతికూల పరిస్థితిలో కూడా రాష్ట్ర పార్టీ ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని నిబద్ధతతో , క్రమ శిక్షణతో పనిచేసి పార్టీ ప్రతిష్టను నిలబెట్టానని వెల్లడించారు. ప్రకటించిన మొదటి 94 ఎమ్మెల్యేల స్థానాల్లో నన్ను అభ్యర్థిగా ప్రకటించే అర్హతలు ఉన్నప్పటికీ నా పేరును పరిగణలోనికి తీసుకోకపోవడం అత్యంత బాధ కలిగించిందని అన్నారు.
నా ఆత్మగౌరవానికి భంగం కలిగిన ఇటువంటి పరిస్థితిలో పార్టీలో కొనసాగలేనని, టీడీపీ పదవులకు, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాని స్పష్టం చేశారు. తనను టీడీపీ నుంచి గెంటివేసినా వైసీపీ(YCP) అధ్యక్షుడు వైఎస్ జగన్ తనను అక్కున చేర్చుకుని పార్టీలోకి ఆహ్వానించారని ఆనందం వ్యక్తం చేశారు. పార్టీ బలోపేతం, అభ్యర్థి విజయానికి అహర్నిశలు కృషి చేస్తానని సూర్యారావు అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన గొల్లపల్లి సూర్యారావు ఎన్టీ్ఆర్, వైఎస్సార్ హయాంలో మంత్రిగా పనిచేశారు. 2014లో టీడీపీ ఎమ్మెల్యేగా పనిచేశారు.