Balineni Srinivas Reddy | సోలార్ విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందానికి సంబంధించి ఏపీ సీఎం జగన్ రూ.1750 కోట్లు లంచం తీసుకున్నారనే కథనాల నేపథ్యంలో నాటి విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. సెకీతో ఆ విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై తాను సంతకాలు చేయలేదని తెలిపారు. ఆ ఒప్పందంలో తన ప్రమేయం లేదని చెప్పారు.
సెకీతో ఒప్పందానికి సంబంధించి తనతో చర్చించకుండానే, సంతకాలు చేయాలని ఒకటికి నాలుగుసార్లు ఒత్తిడి రావడంతో దానిపై అనుమానం వచ్చిందని బాలినేని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. సంతకం చేయాలని అర్ధరాత్రి ఒత్తిడి చేయడంతో ఏదో మతలబు ఉందని అనిపించి సంతకం చేయలేదని తెలిపారు. దీంతో మర్నాడు కేబినెట్లో పెట్టి ఆమోదించుకున్నారని చెప్పారు. మంత్రివర్గంలో కూడావిద్యుత్ ఒప్పందంపై చర్చ జరగలేదని తెలిపారు. యూనిట్ ధర రూ.2.49కి ఒప్పందం చేసుకున్నారని పేర్కొన్నారు. పత్రికల్లో చూసే వరకు అవినీతి జరిగినట్లు తనకు తెలియలేదని అన్నారు. వాళ్ల మాటలు విని అప్పట్లో సంతకం పెడితే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉండేదో అని అన్నారు.
జగన్ మంత్రివర్గంలో స్వేచ్ఛ ఉండేది కాదని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. వైఎస్ఆర్ మంత్రివర్గంలో పూర్తి స్వేచ్ఛ ఉండేదని తెలిపారు. మంత్రిగా నిర్ణయం తీసుకుని వైఎస్ఆర్ చెప్పేవాళ్లమని గుర్తుచేసుకున్నారు. కానీ జగన్ మంత్రివర్గంలో అలాంటి వాతావరణమే లేదని విమర్శించారు. ప్రజాభిప్రాయాన్ని ఎప్పటికప్పుడూ జగన్కు చెప్పేవాడిని అని తెలిపారు. ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను జగన్ దృష్టికి తీసుకెళ్లేవాడిని అని పేర్కొన్నారు. కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనాభిప్రాయం చెప్పడం జగన్కు నచ్చలేదని చెప్పారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న అభిప్రాయాలే చెబుతారా అని జగన్ అనేవారని అన్నారు. ఉన్నఫళంగా మంత్రివర్గం నుంచి తనను తొలగించడంతో బాధేసిందని తెలిపారు. మంత్రివర్గం నుంచి ఎందుకు తొలగించారో తెలియదని చెప్పారు.
విద్యుత్ శాఖ మంత్రిగా ఫోన్ చేసినా సీఎండీలు స్పందించేవారు కాదని బాలినేని తెలిపారు. విద్యుత్ విభాగాల సీఎండీలు కాంట్రాక్టర్ చేతిలో ఉండేవారని అన్నారు. మంత్రిగా ఉన్న నేను కాంట్రాక్టర్ చేతిలో ఉండాలా అని సీఎంవోను అడిగానని చెప్పారు. అన్నీ నిలదీసి అడిగాననే మంత్రి పదవి నుంచి తప్పించారని అనుకుంటున్నానని అన్నారు. అమెరికా కేసులో జగన్ పాత్ర నిజమే అయితే క్షమించరానిదే అని తెలిపారు. ఇవన్నీ చూస్తే జగన్ వద్ద మంత్రిగా ఎందుకు పనిచేశానా అని బాధపడుతున్నా అని వ్యాఖ్యానించారు.