అమరావతి : ప్రభుత్వాలు చేసే ప్రతి చట్టం ప్రజాభిప్రాయంతో చేయాలంటే కుదరదని ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రభుత్వం, ప్రజలకు మధ్య ఎన్నుకున్న ఎమ్మెల్యేలు ఉన్నారని, ఏపీలో పాఠశాలల విలీన ప్రక్రియలో శాసనసభ్యుల అభిప్రాయం తీసుకుంటున్నామని ఆయన వివరించారు. పాఠశాలల విలీనం జరగలేదని, తరగతుల విలీనమే జరిగిందని పేర్కొన్నారు.
పేద పిల్లలు గొప్పవాళ్లు కావాలని తల్లిదండ్రులు కోరుకుంటున్నారని వివరించారు. రాబోయే తరాల భవిష్యత్తు కోసమే విలీనం నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి ప్రజలంతా సహకరించాలని కోరారు. ఏ కార్యక్రమైనా విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని చేపడతామని వెల్లడించారు. భేషజాలకు పోకుండా సమస్య ల పరిష్కారానికి కృషి చేస్తున్నామని అన్నారు.
పాఠశాలల విలీనంపై సంయుక్త కలెక్టర్ ఆధ్వర్యంలో వేసిన కమిటీ నివేదిక వచ్చిన తరువాత తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.