Srisailam | శ్రీశైలం భ్రమరాంబ మల్లిఖార్జునస్వామి ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చూసుకోవాలని ఏపీ లెజిస్లేటివ్ అసెంబ్లీ అంచనాల కమిటీ చైర్పర్సన్, పాలకొండ ఎమ్మెల్యే కళావతి సూచించారు. దేవస్థానంలో భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, క్షేత్రంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై ఆమె.. ఆలయ ఈవో పెద్దిరాజుతో కలిసి స్థానిక భ్రమరాంబ అతిథిగృహంలో బుధవారం సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా అంచనాల కమిటీ చైర్పర్సన్ కళావతి మాట్లాడుతూ.. క్షేత్రాన్ని సందర్శించే భక్తులకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూసుకోవాలని ఆలయ అధికారులకు సూచించారు. ముఖ్యంగా భక్తులకు వసతి, సౌకర్యవంతమైన దర్శనం తదితర ఏర్పాట్ల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరచాలన్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఎప్పటికప్పుడు ఏర్పాట్లను చూస్తుండాలన్నారు. భక్తులు క్యూలైన్లలో అధిక సమయం వేచివుండకుండా దర్శనాలు చేసుకునేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు, ఉగాది మహోత్సవాలు వంటి రద్దీ సమయాల్లో భక్తులకు తగినంత తాగునీరు, వైద్యసేవలు అందుబాటులో ఉంచాలని అంచనాల కమిటీ చైర్పర్సన్ సూచించారు. అదేవిధంగా భక్తులకు కల్పిస్తున్న ఆయా సౌకర్యాలు, క్షేత్రంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు.