Engineering Student | ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా పాణ్యం మండలంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థిని ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత దవాఖానలో చికిత్స పొందుతూ మరణించడం నంద్యాల జిల్లాలో చర్చనీయాంశమైంది. సదరు విద్యార్థిని మూడు నెలల క్రితం పాణ్యం మండలంలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో చేరింది. అయినా ఆమె గర్భిణిగా ఉన్న సంగతి కళాశాల యాజమాన్యం గుర్తించకపోగా, ఆడ బిడ్డకు జన్మనిచ్చేందుకు తోటి విద్యార్థినులకు కూడా తెలియకపోవడం ఆసక్తికర పరిణామం.
ఇదిలా ఉంటే శుక్రవారం మధ్యాహ్నం ఆ విద్యార్థిని తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి, కళాశాలకు రావాలని కోరింది. అదే రోజు రాత్రి హాస్టల్లోని బాత్ రూమ్లో ఆడబిడ్డను ప్రసవించిన తర్వాత స్పృహ కోల్పోవడంతో కళాశాల ఉద్యోగులు ఆమెను దవాఖానలో చేర్చారు. తీవ్రంగా రక్త స్రావం కావడంతో ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. దీంతో ఆమె శనివారం మరణించింది. ఈ ఘటనపై పాణ్యం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.