భర్త విదేశాల్లో ఉండగానే దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కె.శాంతి గర్భం దాల్చిందనే వార్త రెండు రోజులుగా ఏపీలో రెండు రోజుల క్రితం సంచలనం సృష్టించింది. తన భార్య ప్రెగ్నెన్సీకి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, న్యాయవాది సుభాష్ కారణమని ఆమె భర్త మదన్మోహన్ ఇచ్చిన ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై కె.శాంతి స్పందించారు. విజయవాడలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. విజయసాయిరెడ్డితో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
మదన్మోహన్ మానిపాటితో 2013లో తనకు వివాహమైందని.. ఆయనతో ఇద్దరు బిడ్డలను కన్నానని కె.శాంతి తెలిపారు. ఆయన వేధింపులు భరించలేక గిరిజన సంప్రదాయ ప్రకారం 2016లోనే విడాకులు తీసుకున్నానని పేర్కొన్నారు. 2020లో న్యాయవాది సుభాష్ను పెళ్లి చేసుకున్నానని, ఆయనతోనే ఒక బిడ్డను కన్నానని చెప్పారు. మరొకరి భార్యను అని తెలిసి కూడా మదన్మోహన్ తనను తీవ్రంగా వేధించాడని, కోట్ల రూపాయలు సంపాదించి తనకు ఇవ్వాలని ఒత్తిడి చేసేవాడని చెప్పారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని తాను వైజాగ్లోనే చూశానని.. ఆయనతో శాఖాపరమైన అంశాలు మాత్రమే చర్చించానని కె.శాంతి తెలిపారు. విజయసాయిరెడ్డితో తనకు సంబంధం అంటకడుతున్నారని.. తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విజయసాయిరెడ్డితో నాకు సంబంధం అంటగట్టడానికి సిగ్గులేదా? ఆయన వయసుకు అయినా గౌరవం ఇవ్వరా? అని ప్రశ్నించారు. ఒకవేళ నేను చనిపోతే నాపై ఆరోపణలు చేసిన వారే నా చావుకు కారణమవుతారని ఆవేదన వ్యక్తం చేశారు. విజయసాయిరెడ్డి తనకు తండ్రిలాంటి వారని.. దయచేసి ఆయనతో తనకు సంబంధం అంటగట్టకండి అని విజ్ఞప్తి చేశారు.
తన సస్పెన్షన్ అంశంపై కూడా దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కె.శాంతి స్పందించారు. అవినీతి ఆరోపణలతో పాటు ఉద్యోగుల్లోనూ తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆమెను విధుల్లో నుంచి తొలగించామని అధికారులు చెప్పారు. అయితే ఈ ప్రచారాన్ని కె.శాంతి ఖండించారు. గిరిజన మహిళ కాబట్టే తనను వేధిస్తున్నారని తెలిపారు. తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని స్పష్టం చేశారు.