అమరావతి : ఏపీలో వైసీపీ ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుంటామని బీజేపీ ఏపీ శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు హెచ్చరించారు. రాష్ట్రంలో బీజేపీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టి భయాందోళనలకు గురిచేస్తుందని ఆయన ఆరోపించారు. ఈ రోజు విజయవాడలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రెండు రోజుల క్రితం ఆత్మకూరులో జరిగిన ఘటనలో ప్రభుత్వమే మొదటి ముద్దాయని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వానికి అధికారమిచ్చింది.. అరాచక పాలన కొనసాగించడానికా అని విమర్శించారు.
బీజేపీ నాయకుడు శ్రీకాంత్రెడ్డిని చంపేస్తామంటూ కొందరు బెదిరించిన ఆడియో తన వద్ద ఉందని పేర్కొన్నారు. శ్రీకాంత్రెడ్డిపై తప్పుడు కేసుపెట్టి జైలుకు పంపడం దారుణమని అన్నారు. బీజేపీ నాయకులపై పెట్టిన కేసులను వెంటను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సినిమా టికెట్ల ధరలు తగ్గించినట్లే , ఇసుక ధరలు ఎందుకు తగ్గించరని, సినిమా టికెట్ ధరలు తగ్గించి గొప్పగా చెప్పుకోవడమేమిటని ప్రశ్నించారు. బియ్యం అక్రమ రవాణాలో అధికార పార్టీ నాయకులదే కీలక పాత్ర అని ఆరోపించారు.