అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు గతంలో ఒప్పుకున్న డిమాండ్లను పరిస్కరించాల్సిందే అని ఉద్యోగ సంఘాల నేతలు పట్టుబట్టారు. గురువారం సాయంత్రం ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలు మంత్రివర్గ ఉపసంఘంతో భేటీ అయ్యారు. ప్రభుత్వం తరపున సజ్జల నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రి బొత్స సత్యనారాయణ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉపసంఘానికి ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు తమ డిమాండ్లను మరోసారి వినిపించాయి. పీఆర్సీతోపాటు పెండింగ్లో ఉన్న అన్ని రకాల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.
ఉద్యోగులకు ఆరోగ్య పథకం లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు ఎదురువుతున్నాయని, ఇవాల్టి చర్చల్లో ప్రధానంగా ఈహెచ్ఎస్పై ఫోకస్ పెట్టామని ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి తెలిపారు. దీనిపై సుదీర్ఘంగా చర్చించామని, ఆరోగ్య శాఖ అధికారులను సమావేశానికి పిలిపించి వారితో మాట్లాడారని చెప్పారు. ఆరోగ్యశ్రీ కింద ఉన్న వ్యాధులను ఈహెచ్ఎస్ కిందకు తీసుకురావాలన్నది మా ప్రధాన డిమాండ్ కాగా, దానిపై త్వరతగతిన నిర్ణయం తీసుకుంటామని మంత్రివర్గ ఉపసంఘం హామీ ఇచ్చిందని తెలిపారు. ఆరోగ్యశ్రీ ఉన్న దవాఖానలన్నింటిలో కూడా ఈహెచ్ఎస్ అమలయ్యేలా చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశామన్నారు.
పీఆర్సీపై సుదీర్గంగా ఉద్యోగులతో మంత్రివర్గ ఉపసంఘం చర్చింది. గతంలో హామీ ఇచ్చినట్లుగా అన్ని కార్యాలయాలు, సంస్థల్లో ఉద్యోగుల వయసును పెంచడాన్ని కూడా మంత్రివర్గ ఉపసంఘం దృష్టికి తీసుకెళ్లారు. ఈ నెలాఖరుకు చాలా మంది ఉద్యోగులు పదవీ విరమణ పొందే అవకాశం ఉన్నందున, త్వరగా చర్యలు తీసుకుని అందరికీ ఉపయోగపడేలా చూడాలని కూడా ఉద్యోగ సంఘాల నేతలు కోరారు. దీనిపై సీఎం జగన్తో చర్చించిన మీదట ఒకట్రెండు రోజుల్లో ఉత్తర్వులు వెలువడేలా చూస్తామని హామీ ఇచ్చినట్లుగా తెలుస్తున్నది. మంత్రివర్గ ఉపసంఘంతో జరిగిన చర్చల్లో ముఖ్యంగా జీపీఎఫ్ అకౌంట్ల నుంచి డబ్బు మాయం కావడం గురించి ప్రభుత్వాన్ని నిలదీశామని, అలాగే లీవ్ ఎన్క్యాష్మెంట్, డీఏ బకాయిలను వారి దృష్టికి తీసుకెళ్లినట్లు ఏపీ ఎన్జీఓ అధ్యక్షుడు బండి శ్రీనివాస్రావు చెప్పారు.