అమరావతి: ప్రధాన సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంటే.. ఉద్యోగులు మాత్రం మూడు డిమాండ్లపైనే పట్టుబట్టి ఉన్నాయని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఉద్యోగుల కార్యాచరణ ప్రారంభం కాకముందే చర్యల ద్వారా సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. సమ్మెకు వెళ్లకముందు ఉద్యోగులు రోడ్డెక్కడం సమంజసం కాదన్నారు. ఉద్యోగులు ఛలో విజయవాడ పేరుతో రేపు ఉద్యోగులు చేసేది బలప్రదర్శన తప్ప మరేమీ కాదన్నారు. అవసరం లేని చోట ఎవరిపై బలప్రదర్శన చేస్తున్నారో తెలుసుకోవాలని సజ్జల సూచించారు.
ఉద్యోగుల కార్యాచరణను ఇప్పటికే వాయిదా వేసుకోవాలని కోరినట్లు సజ్జల చెప్పారు. ఇప్పటివరకు ఉద్యోగ సంఘాల నేతల నుంచి ఎలాంటి స్పందన రాలేదన్నారు. రేపు విజయవాడలో ఉద్యోగులు చేసేది ముమ్మాటికీ బలప్రదర్శనే అని సజ్జల ఆరోపించారు. ప్రభుత్వంతో వైషమ్యాలు పెంచుకుని ఉద్యోగులు ఏం సాధిస్తారని ఆయన ప్రశ్నించారు. కరోనా ఆంక్షలు అమలులో ఉన్నందున సభలు, సమావేశాలకు పోలీసులు, ప్రభుత్వం అనుమతి ఇవ్వదని స్పష్టం చేశారు.
ప్రధాన సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని చెప్పినప్పటికీ.. ఉద్యోగులు పట్టించుకోకుండా కేవలం మూడు డిమాండ్లపైనే పట్టుబడుతున్నారని సజ్జల అన్నారు. ఉద్యోగ సంఘాలు చేస్తున్న మూడు డిమాండ్లకు కాలం చెల్లిందన్నారు. ఇప్పటికే ఉద్యోగుల బ్యాంకు అకౌంట్లలో జీతాలు పడ్డాయని.. వాళ్ల సమస్యలపై ఆందోళనలకు దిగే బదులు ప్రభుత్వంతో చర్చలకు రావచ్చునని సజ్జల సూచించారు. ప్రస్తుత పరిస్థితిపై ఉద్యోగ సంఘాల నేతలు ఆత్మ విమర్శ చేసుకోవాన్నారు.