తిరుమల : వైకుంఠ ఏకాదశి సందర్భంగా టోకెన్ల కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాట (Stampede) ఘటనపై శుక్రవారం టీటీడీ అత్యవసర సమావేశం (TTD Emergency meeting) ఏర్పాటు చేసింది. తిరుమలలోని పాలక మండలి కార్యాలయంలో సాయంత్రం 4 గంటలకు సమావేశం కానుంది. తొక్కిసలాటలో మృతుల కుటుంబాలకు పరిహారంపై సమావేశంలో తీర్మానం చేసే అవకాశముంది.
బాధిత కుటుంబ సభ్యులకు పరిహారం చెక్కులు (Checks) తయారు చేసే అంశంపై , ముగ్గురు టీటీడీ బోర్డు సభ్యుల బృందం చెక్కులను రేపు (శనివారం) అందజేసే అంశంపై చర్చించనున్నారు. అదేవిధంగా వైకుంఠ ద్వార సర్వదర్శనం టోకెన్ల జారీ తొక్కిసలాటపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన చర్చ జరుగనుంది.
గత బుధవారం రాత్రి తిరుపతిలోని పద్మావతి గార్డెన్లో నెలకొల్పిన టోకెన్ల పంపిణీ కేంద్రం వద్ద తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ తొక్కిసలాటలో ఆరుగురు మృత్యువాత పడగా 48 మంది గాయపడ్డారు. ఈ ఘటనను తీవ్రంగా స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ గురువారం తిరుపతి ఆసుపత్రిలో ఉన్న క్షతగాత్రులను పరామర్శించారు.
అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ డీఎస్పీ పాటు గోశాల డైరెక్టర్ను సస్పెండ్ చేశారు. జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు, టీటీడీ జేఈవో గౌతమి, సీవీఎస్వో శ్రీధర్ను అక్కడి నుంచి బదిలీ చేశారు. ఘటనలో చనిపోయిన మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ. 25 లక్షలు, తీవ్రంగా గాయపడ్డ ఇద్దరికి రూ. 5 లక్షలు, స్వల్పంగా గాయపడ్డ వారికి లక్ష చొప్పున ప్రభుత్వం పరిహారంగా ప్రకటించింది.