TTD News | తిరుమల పవిత్రత, పర్యావరణ పరిరక్షణలో టీటీడీ మరో ముందడుగు వేసింది. తిరుమలలో భక్తుల కోసం నడుపుతున్న ధర్మ రథాల (ఉచిత బస్సుల) స్థానంలో విద్యుత్ బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ ఏర్పాట్లకు సంబంధించి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తిరుమల అన్నమయ్య భవనంలో ఒలెక్ట్రా కంపెని ప్రతినిధులు, ఆర్టీసీ, టీటీడీ అధికారులతో సమీక్ష జరిపారు. అనంతరం చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ, సీఎం జగన్ ఆదేశాల మేరకు తిరుమలను కాలుష్య రహిత పుణ్య క్షేత్రంగా తీర్చిదిద్దడానికి ఇప్పటికే అనేక చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ప్లాస్టిక్ బాటిళ్ళు, కవర్ల నిషేధం కూడా ఇందులో భాగమన్నారు. తొలివిడతగా తిరుమలలో పనిచేసే అధికారులకు విద్యుత్తో నడిచే కార్లను అందజేసినట్లు తెలిపారు.
తిరుమలలో భక్తుల కోసం నడుపుతున్న ధర్మ రథాల స్థానంలో విద్యుత్ బస్సులు నడిపేందుకు 10 బస్సులు విరాళంగా ఇవ్వాలని ఒలెక్ట్రా కంపెని అధినేత కృష్ణారెడ్డిని కోరానని సుబ్బారెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా దాదాపు రూ.15 కోట్ల విలువ చేసే 10 విద్యుత్ బస్సులను విరాళంగా అందించేందుకు ముందుకు రావడం సంతోషకరమన్నారు. బస్సుల డిజైనింగ్, నిర్వహణపై దృష్టి సారించామన్నారు. భక్తులకు సదుపాయంగా ఉండేలా బస్సులను డిజైన్ చేయాలని సూచించినట్లు ఆయన చెప్పారు. తుది దశలో తిరుమలలో తిరిగే ట్యాక్సీలు, ఇతర అద్దె వాహనాల స్థానంలో టీటీడీ బోర్డు సహకారంతో బ్యాంకు రుణాలు ఇప్పించి విద్యుత్ వాహనాలు ఏర్పాటు చేయనున్నట్లు సుబ్బారెడ్డి పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఒలెక్ట్రా కంపెని ప్రతినిధులు బస్సుల డిజైన్లు, నిర్వహణ అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కోరిక మేరకు 10 విద్యుత్ బస్సులు విరాళంగా అందించడం శ్రీ వేంకటేశ్వరస్వామి తమకు అందించిన గొప్ప వరంగా భావిస్తున్నామని కంపెని సీఎండీ ప్రదీప్ చెప్పారు. ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గోపినాథ్ రెడ్డి, జిల్లా ప్రజా రవాణా అధికారి చెంగల్రెడ్డి, టీటీడీ రవాణా విభాగం జీఎం శేషారెడ్డి, తిరుమల డిపో మేనేజర్ విశ్వనాథ్ తదితరులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. సమీక్ష అనంతరం తిరుమల అన్నమయ్య భవనం నుంచి లేపాక్షి సర్కిల్ వరకు అధికారులతో కలిసి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి విద్యుత్ బస్సులో ప్రయాణించారు.