బెంగుళూరు: బెంగుళూరు శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా స్వామివారి దర్శనం కల్పించేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు బెంగుళూరు స్థానిక సలహా మండలి అధ్యక్షులు రవి సంపత్ నారాయణ చెప్పారు. బెంగుళూరులోని టీటీడీ సమాచార కేంద్రంలో డిప్యూటీ ఈవో గుణ భూషణ్ రెడ్డితో కలిసి ఆయన వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లను మీడియాకు వివరించారు.
వైకుంఠ ఏకాదశి రోజు తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకోలేని భక్తులు బెంగుళూరులోని స్వామి వారిని దర్శించుకోవాలని భక్తులకు సూచించారు. వైకుంఠ ఏకాదశి రోజున తెల్లవారుజాము 2 గంటల నుంచి స్వామివారి దర్శనం ప్రారంభమవుతుందని తెలిపారు. ఆలయం వద్ద వీఐపీలకు ప్రత్యేక క్యూ లైన్, రూ. 200 శీఘ్ర దర్శనం ప్రత్యేక క్యూ లైన్, సర్వదర్శనం ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. వీఐపీలు తమకు ప్రత్యేకంగా కేటాయించిన సమయంలోనే వచ్చి స్వామివారిని దర్శించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
మిగతా సమయం అంతా సర్వదర్శనానికి కేటాయిస్తున్నట్లు తెలిపారు. క్యూలైన్లలో వేచి ఉండే భక్తులకు ఇబ్బంది లేకుండా చలువ పందిళ్ళు సూచిక బోర్డులను ఏర్పాటు చేస్తామన్నారు. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు ఉంటాయని, తిరుమల నుండి వచ్చే శ్రీవారి లడ్డు ప్రసాదము,క్యాలెండర్లు, డైరీలు భక్తులకు అందుబాటులో ఉంచనున్నట్లు వివరించారు.