హైదరాబాద్, డిసెంబర్ 1(నమస్తే తెలంగాణ): వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ నెల 23 నుంచి జనవరి 1 వరకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం కోసం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్టు టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. భక్తులు క్యూలైన్లలో ఎక్కువ సమయం వేచి ఉండటాన్ని నివారించేందుకు టైంస్లాట్ టోకెన్లు జారీ చేస్తున్నామని చెప్పారు. 2.25 లక్షల రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఈ నెల 10న ఆన్లైన్లో విడుదల చేయనున్నట్టు వెల్లడించారు.
తిరుపతి, తిరుమలలోని 10 కేంద్రాల్లో 94 కౌంటర్ల ద్వారా ఈ నెల 22 నుంచి మొత్తం 4,23,500 టోకెన్లు మంజూరు చేస్తామని వివరించారు. దర్శన టోకెన్లు ఉన్న భక్తులను మాత్రమే తిరుమల శ్రీవారి దర్శనానికి అనుమతిస్తామని స్పష్టంచేశారు. వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో ఈ నెల 22 నుంచి 24 వరకు, డిసెంబరు 31, జనవరి 1న కల్యాణోత్సవం, ఊంజల్సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలు రద్దు చేసినట్టు తెలిపారు. కాగా, తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది.
5 కంపార్ట్మెంట్లు నిండిపోగా టోకెన్లు లేని భక్తులకు 8 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. గురువారం స్వామివారిని 58,278 మంది భక్తులు దర్శించుకోగా 17,220 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ.3.53 కోట్లు వచ్చిందని పేర్కొన్నారు.
టీటీడీకి శుక్రవారం ఓ దాత రెండు బస్సులను విరాళంగా అందజేశారు. చెన్నైకి చెందిన ప్రముఖ విద్యా సంస్థ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అధ్యక్షుడు సత్యనారాయణ, వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ నారాయణరావు రూ.80 లక్షల విలువైన రెండు బస్సుల తాళాలను ఈవో ఏవీ ధర్మారెడ్డికి అందజేశారు.
2024వ సంవత్సరం డైరీలు, క్యాలెండర్లు తిరుమల, తిరుపతితోపాటు చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ, వైజాగ్లోని శ్రీవారి ఆలయాలు, ముంభై, న్యూఢిల్లీ, వేలూరు, కాంచీపురంలోని సమాచార కేంద్రాలు, నెల్లూరు, రాజమండ్రి, కాకినాడ, కర్నూలులోని టీటీడీ కల్యాణమండపాల్లో అందుబాటులో ఉన్నాయని ఈవో తెలిపారు.