Srisailam | శ్రీశైల మహా క్షేత్రంలో జరిగే కార్తీక మాసోత్సవాలకు వచ్చే యాత్రికులకు అవసరమైన ఏర్పాట్లను వెంటనే పూర్తి చేయాలని దేవస్థానం అధికారులను ఈవో లవన్న ఆదేశించారు. ముఖ్యంగా మాసాంతం భక్తులు కార్తీక దీపాలను వెలిగించుకునే సదుపాయాలను ప్రత్యేకంగా పరిశీంచారు.
ఆదివారం ఉదయం ఆలయ ప్రధాన విభాగాధిపతులతో కలిసి ఐటీ విభాగం, ఆర్జిత సేవా కౌంటర్లు, క్యూలైన్లు, విరాళాల కేంద్రం, లడ్డూ విక్రయ కేంద్రాలు, అన్నదాన విభాగంతోపాటు శానిటేషన్ తదితర ఏర్పాట్ల పురోగతిని పరిశీలించారు.
యాత్రికుల అవసరాలకు అనుగుణంగా వసతి ఏర్పాట్ల కల్పనలో రాజీపడవద్దని ఆయన సూచించారు. ఈవో వెంట డీఈ నర్సింహారెడ్డి, శ్రీశైలప్రభ ఎడిటర్ అనిల్కుమార్, ఏఈవో హరిదాసు, సూపరింటెండెంట్ రవికుమార్, జగదీష్రెడ్డి, ఇందూధర్ తదితరులు ఉన్నారు.
శ్రీశైల శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లను తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లలిత కన్నెగంటి దంపతులు దర్శించుకున్నారు. ఆదివారం శ్రీశైల క్షేత్రం చేరుకున్న వారికి శ్రీకృష్ట దేవరాయ గోపురం వద్ద ఈవో లవన్న ఆధ్వర్యంలో అర్చక వేదపండితులు తిలక ధారణ చేసి ఆలయ సంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు.
స్వామివారి గర్బాలయంలో అభిషేకం, బిల్వార్చన, అమ్మవారి ఆలయంలో కుంకుమార్చన హారతులు చేయించారు. తర్వాత ప్రాకార మండపంలో వేదాశీర్వచనాలు వల్లించిన ప్రధానార్చకులు అభిషేక జల తీర్థప్రసాదాలు అందచేశారు. జస్టిస్ దంపతులు సాయంత్రం స్వామిఅమ్మవార్ల లీలా కళ్యాణంలో కూడా పాల్గొన్నారు.