అమరావతి : డీఎస్సీ ( DSC ) లో జరిగిన అక్రమాలపై విచారణ చేపట్టాలని వైసీపీ ( YCP )విద్యార్థి సంఘం శుక్రవారం ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు నిర్వహించింది. సంబంధిత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh ) తన పదవికి రాజీనామా ( Resign ) చేయాలని డిమాండ్ చేశారు. స్పోర్ట్స్ కోటాలో పోస్టులు అమ్ముకున్నారని, పేపర్ లీకేజీపై విచారణ చేయాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేశారు.
అనంతపురం, గుంటూరు, విశాఖ తదితర పట్టణాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ ప్రభుత్వం నిర్వహించింది మెగా డీఎస్సీ కాదని, దగా డీఎస్సీ అని ఆరోపించారు. పరీక్షలు నిర్వహించే వ్యక్తులే డీఎస్సీ పరీక్ష రాస్తారని ప్రశ్నించారు. లోకేష్ డబ్బులకు స్పోర్ట్స్ సర్టిఫికెట్లు అమ్ముకున్నారని విమర్శించారు. డీఎస్సీలో జరిగిన అక్రమాలు, అవకతవకలపై వెంటనే సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
విశాణలో నిర్వహించిన పోరుబాటలో ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, కుంభ రవిబాబు, పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు పాల్గొన్నారు. తిరుపతిలో జరిగిన కార్యక్రమంలో టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ డీఎస్సీలో ఒక్కో ఉద్యోగానికి 15 నుంచి 20 లక్షలకు అమ్ముకున్నారని ఆరోపించారు. ఓసీ ఓపెన్ కటాఫ్ లేకుండా బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు అన్యాయం చేశారని విమర్శించారు.