అమరావతి : రాష్ట్ర ప్రజలకు త్వరితగతిన మొబైల్ ద్వారా సేవలు అందించేందుకు ఉద్దేశించిన ఈ గవర్నెన్స్ (e-governance ) వాట్సాప్ సేవలను (WhatsApp) ఏపీ ప్రభుత్వం ప్రారంభించింది. గురువారం ఉండవల్లిలోని ప్రజాదర్బార్ కార్యాలయంలో మంత్రి లోకేష్ ( Minister Lokesh) ఈ గవర్నెన్స్ వాట్సాప్ పాలనను ఆవిష్కరించారు.
తొలి దశలో 161 ప్రభుత్వ సేవలు ( Services ) అందించనున్నామని మీడియా సమావేశంలో మంత్రి వెల్లడించారు. వాట్సాప్ ద్వారా పౌరులకు సేవలు అందించడంతో పాటు ప్రభుత్వ సమాచారం కూడా చేరవేస్తామని అన్నారు. ఈ సేవల కోసం ప్రభుత్వం అధికారికంగా వాట్సాప్ నంబరును 91 95523 00009 ప్రజలకు అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.
రెండో దశలో 300కు పైగా సేవలు అందుబాటులోకి తీసుకొస్తామని వివరించారు. రెండో విడతలో వాట్సప్ గవర్నెన్స్ కు ఏఐని కూడా జోడిస్తామన్నారు. నకిలీ సర్టిఫికెట్లు ( Certificates) జారీ చేసే అవకాశమే లేకుండా వాట్సప్ గవర్నెన్స్ ఉండబోతోందని అన్నారు. తొలి విడతలో ఏపీఎస్ఆర్టీసీ, రెవెన్యూ, దేవాదాయ, ఇందన, మున్సిపల్ తదితర శాఖల్లో ఈ సేవలు మొదలవుతాయని అన్నారు. సర్టిఫికెట్ల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే విధానానికి స్వస్తి పలికి వాట్సప్ సేవలతో అందించనున్నామని తెలిపారు.
ప్రజల వినతులు, ఫిర్యాదులు ఇవ్వాలనుకుంటే వాట్సప్ నంబర్కు సమాచారం అందిస్తే వెంటనే ఒక లింక్ వస్తుందని, అందులో పేరు, ఫోన్ నంబర్, చిరునామా తదితరాలు నమోదు చేసి సమస్యను టైప్ చేయాలని సూచించారు. వెంటనే వారికి ఒక రిఫరెన్స్ నంబరు వస్తుందని, దాని ఆధారంగా తమ వినతి పరిష్కారం ఎంత వరకూ వచ్చింది? ఎవరి వద్ద ఉంద అనేది పౌరులు తెలుసుకోవచ్చని అన్నారు.
ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఆదాయం, నో ఎర్నింగ్తో పాటు వివిధ శాఖలకు సంబంధించిన అనేక సర్టిఫికెట్లు వాట్సప్ ద్వారా పొందవచ్చని పేర్కొన్నారు. ఏపీఎస్ఆర్టీసీ టికెట్ బుకింగ్, క్యాన్సిలేషన్, విద్యుత్ బిల్లులు, ఆస్తి పన్నులు, ట్రేడ్ లైసెన్స్లు, రెవెన్యూ శాఖకు సంబంధించి ల్యాండ్ రికార్డులు వంటివి ఈ సేవలో అందిస్తామని పేర్కొన్నారు.