ఎన్టీఆర్ జిల్లా : విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు పది రోజుల పాటు కొనసాగనున్నాయి. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కనకదుర్గ అమ్మవారు స్వర్ణకవచాలంకృత దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇంద్రకీలాద్రి అమ్మవారిని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దంపతులు దర్శించుకున్నారు. వేడుకల్లో పాల్గొంటున్న భక్తులకు ఎలంటి ఇబ్బందులు రాకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
ఇంద్రకీలాద్రిపై నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తుల రద్దీ నేపథ్యంలో వీఐపీ దర్శనాలను కుదించారు. కాగా, నవరాత్రుల్లో ప్రత్యేక అలంకారాలతో అమ్మవారు దర్శనం ఇస్తారు. తొలిరోజున స్వర్ణకవచాలంకృతంగా భక్తులకు దర్శనమిచ్చారు. తొలిరోజునే అమ్మవారిని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దంపతులు దర్శించుకున్నారు. ఇంద్రకీలాద్రికి వచ్చిన గవర్నర్ దంపతులను ఏపీ మంత్రి కొట్టు సత్యనారాయణ, ఆలయ ఈఓ భ్రమరాంబ స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి సుమంగళ ద్రవ్యాలను గవర్నర్ దంపతులు సమర్పించారు. బిశ్వభూషణ్ దంపతులతు పండితులు వేదాశ్వీరచనం చేసి పట్టు వస్త్రాలు అందించారు.
రాష్ట్ర ప్రజలకు గవర్నర్బిశ్వభూషణ్ హరిచందన్ దసరా శుభాకాంక్షలు తెలిపారు. నవరాత్రి తొలిరోజున కనకదుర్గమ్మను దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉన్నదని తనను కలిసిన మీడియాతో చెప్పారు. తన కుటుంబంతో పాటు రాష్ట్ర, దేశ ప్రజలపై అమ్మవారు కరుణ చూపాలని కోరుకున్నట్లు ఆయన తెలిపారు. కాగా, భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని వీఐపీ దర్శనాలను అధికారులు కుదించివేశారు. కొండపైకి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు.