కర్నూలు జిల్లా : కృష్ణా పరివాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నది. దాంతో రిజర్వాయర్ నిండు కుండలా మారింది. నిమిష నిమిషానికి ఇన్ఫ్లో పెరుగుతుండటంతో 6 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. వరద ప్రవాహం పెరుగుతుండటంతో నీటిని విడుదల చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అటు తుంగభద్ర డ్యాంకు కూడా వరద పోటెత్తింది. దాంతో 30 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు.
శ్రీశైలం జలాశయంకు వరద పోటెత్తింది. ప్రస్తుతం ఇన్ఫ్లో 1,51,058 క్యూసెక్లుగా ఉండగా.. అవుట్ ఫ్లో 1,47,254 క్యూసెక్గా నమోదైంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 885 అడుగుల నీరు ఉన్నది. ప్రస్తుతం నీటి నిల్వ 215.8070 టీఎంసీలుగా ఉన్నది. కాగా, జూరాల, సుంకేసుల నుంచి దాదాపు 1,73,695 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులోకి చేరుతున్నట్లు అధికారులు తెలిపారు. నదిలో నీరు ఎక్కువగా ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మత్య్సకారులు చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు.
శ్రీశైలం ఎగువ ప్రాంతాల నుంచి వరద పోటెత్తుతున్నది. ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేస్తుండటంతో శ్రీశైలం రిజర్వాయర్కు వరద నీటి ప్రవాహం పెరిగింది. స్పిల్వే ద్వారా సముద్రంలోకి 1,73,695 క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతోపాటు శ్రీశైలం కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి జరుగుతున్నది. విద్యుత్ ఉత్పత్తి ద్వారా 63,046 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు గేట్లను ఎత్తివేయడంతో శ్రీశైలం ఆలయానికి వచ్చిన భక్తులు రిజర్వాయర్ అందాలను తిలకిస్తున్నారు. కంటిన్యూగా వర్షం పడుతుండటంతో ఇక్కడి అందాలను చూసేందుకు వచ్చిన పర్యాటకులు ఇబ్బందులకు గురవుతున్నారు.