విజయవాడ: ప్రత్యేక హోదా అంశానికి ద్రోహం చేసింది చంద్రబాబే అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. ప్యాకేజీకి ఒప్పుకున్న చంద్రబాబుకు ప్రత్యేక హోదా గురించి మాట్లాడే అర్హత ఉన్నదా? అని ప్రశ్నించారు. చంద్రబాబు కారణంగానే ప్రత్యేక హోదా అంశం నేటికీ నానుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మంత్రి కన్నబాబు మీడియాతో మాట్లాడారు.
కేంద్రం ప్రకటించిన ప్యాకేజీకి ఒప్పుకుని పండగ చేసుకున్నది చంద్రబాబు కాదా? అని మంత్రి కురసాల కన్నబాబు ప్రశ్నించారు. ప్రత్యేక హోదా కోసం మా ఎంపీలు రాజీనామా చేస్తే టీడీపీ ఎందుకు చేయలేదో స్పష్టం చేయాలన్నారు. ఇప్పుడు హోదా గురించి మాట్లాడుతున్న చంద్రబాబుకు సిగ్గే లేదని చెప్పారు. ప్రత్యేక హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టింది ముమ్మాటికీ చంద్రబాబే అని ఆరోపించారు.
త్రి సభ్య కమిటీ సమావేశం ఎజెండా నుంచి ప్రత్యేక హోదా అంశాన్ని జీవీఎల్ తొలగించేలా చేయడం అశ్చర్యానికి గురి చేసిందన్నారు. జీవీఎల్, చంద్రబాబు కలిసే ఈ నాటకానికి తెరలేపారని విమర్శించారు. ఎజెండా నుంచి ప్రత్యేక హోదా అంశం తొలగించడంతో టీడీపీ, బీజేపీ మధ్య ఉన్న చీకటి తెరలు తొలగిపోయాయని వ్యాఖ్యానించారు. ట్విట్టర్ ఉంది కదా అని ఏదంటే అది లోకేష్ మాట్లాడుతున్నాడని మండిపడ్డారు.