Bharat Ratna for Ghantasala | అమరగాయకుడు, పద్మశ్రీ ఘంటసాలకు భారతరత్న కోసం 28కి పైగా దేశాల్లోని తెలుగు సంస్థల ప్రతినిధులు ఏకతాటిపైకి వచ్చి పని చేయడం అభినందనీయం అని నంది అవార్డు గ్రహీత, కలైమామణి, గాన సామ్రాట్ డాక్టర్ మనో (నాగూర్బాబు) అన్నారు. శ్రీఘంటసాల శత జయంతి వేడుకల సందర్భంగా ఆయనకు భారత్ రత్న ఇవ్వడం సముచితం అనే నినాదంతో అమెరికాలోని శంకర నేత్రాలయ యూఎస్ఏ అధ్యక్షుడు బాల ఇందుర్తి ఆధ్వర్యంలో 110కి పైగా టీవీ చర్చాగోష్టులు నిర్వహించారు. ఇందులో భాగంగా న్యూజిలాండ్ నుంచి శ్రీలత మగతల వ్యాఖ్యతగా ఆదివారం జూమ్ ద్వారా జరిగిన వర్చువల్ చర్చాగోష్టిలో డాక్టర్ మనో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డాక్టర్ మనో మాట్లాడుతూ తన చిన్న నాటి రోజుల్లో ఘంటసాల పాటలు విని పెరిగానన్నారు. ముఖ్యంగా ఘంటసాల పాడిన శివశంకరి, రసికరాజా, మది శారదాదేవి వంటి పాటలు అనేక కచేరీలలో పాడి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించానన్నారు. తన వంటి వారు మంచి గాయకులుగా ఎదగడానికి ఘంటసాల కారణం అని అన్నారు. శ్రీ ఘంటసాల గొప్ప గాయకుడు అని కొనియాడారు.
ఈ కాలం గాయకులు అందరు వారిని ఆదర్శంగా తీసుకొని గొప్ప కళాకారులుగా ఎదగాలని డాక్టర్ మనో ఆకాంక్షించారు. ఘంటసాల పాడిన కొన్ని అలనాటి పాటల పల్లవి పాడి టీవీ ప్రేక్షకులను అలరించారు. మీరందరూ భారతరత్న పురస్కారానికి చేస్తున్నచిరు ప్రయత్నం అతి త్వరలోనే సాకారం కావాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రయత్నానికి తన పూర్తి మద్దతు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య ఉపన్యాసకులుగా రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి శైలేష్ లఖ్టాకియా (ఇండియన్ కౌన్సులేట్) మాట్లాడారు. ఘంటసాల స్వయంగా హిందీలో పాడి స్వరకల్పన చేసిన ఝండ ఊంచా రహే హమారా పాటను గుర్తు చేశారు.
చెన్నై నుంచి చర్చాగోష్టిలో పాల్గొన్న శ్రీఘంటసాల కోడలు కృష్ణకుమారి ఘంటసాల మాట్లాడుతూ నిర్వాహకుల ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా అభినందించారు. మన అందరి ప్రయత్నాలు సఫలం కావాలని ఆకాంక్షించారు. సింగపూర్ నుండి శ్రీ సాంస్కృతిక కళాసారథి వ్యవస్థాపక అధ్యక్షుడు రత్న కుమార్ కవుటూరు మాట్లాడుతూ ఇప్పటిదాక ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న 28 దేశాల తెలుగు సంస్థల సేవలను కొనియాడారు.
శంకర్ నేత్రాలయ బోర్డు సభ్యులు ప్రసాద్ రాణి, ఆస్ట్రేలియా సిడ్నీ నుండి తబలా విధ్వాంసులు, ఆదిశేషు కోట, తెలుగు భాగవత ప్రచారసమితి అధ్యక్షులు, భాస్కర్ వులపల్లి, న్యూజిలాండ్ నుండి న్యూజిలాండ్ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్, అనిత మొగిలిచెర్ల, భారత్ నుండి జి వి రమణ (RACCA, రాజమహేంద్రవరం) గాయకుడు, నిర్వాహకుడు, శివరామి రెడ్డి వంగ అడ్మిన్, మా నాన్నాఘంటసాల, తెలంగాణ తదితరులు ఘంటసాల పాటలతో తమకున్న అభిమానాన్ని, వారి పాటలలోని మాధుర్యాన్ని గుర్తుచేసుకున్నారు, ఘంటసాలకు భారతరత్న దక్కకపోవడం చాలా బాధాకరం అని అభిప్రాయ పడ్డారు. ఇది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 15 కోట్ల మంది తెలుగువారి ఆత్మ గౌరవం అని అభిప్రాయపడ్డారు. కనుక ఘంటసాలను కేంద్రం తగిన రీతిన గుర్తించి ఆయనను భారతరత్న అవార్డుతో సత్కరించాలని కోరారు. ఇందుకు విదేశాల్లో నివసిస్తున్న తెలుగు సంస్థల ప్రతినిధులు, తెలుగేతర సంస్థల ప్రతినిధులను ఏకతాటిపైకి తెచ్చి.. ఘంటసాలకు భారతరత్న వచ్చే వరకు సమిష్టిగా కృషి చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో అమెరికాలోని పలు తెలుగు జాతీయ సంస్థలు, భారత్లోని పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఇంకా స్విట్జర్లాండ్ ,నైజీరియా, స్కాట్లాండ్, డెన్మార్క్, ఉగాండా, సౌదీ అరేబియా, హంగేరి, బ్రూనై, బోత్సవాన, మారిషస్, ఇండోనేషియా, హాంగ్ కాంగ్, థాయిలాండ్, కెనడా, బెహ్రెయిన్, ఫ్రాన్స్, న్యూజీలాండ్, ఆస్ట్రేలియా, సింగపూర్, మలేషియా, యూఏఈ, ఖతార్, ఒమన్, నార్వే, లండన్, దక్షిణాఫ్రికా లోని పలు తెలుగు సంస్థలతో 113 టీవీ కార్యక్రమాలను నిర్వహించామని నిర్వాహుకులు తెలిపారు.
ఘంటసాలకు భారతరత్న ఇవ్వాలని మొదలుపెట్టిన సంతకాల సేకరణకు (Signature Campaign) అనూహ్యస్పందన లభిస్తున్నదని నిర్వాహుకులు తెలిపారు. వివరాలు మీ అందరికోసం:
https://www.change.org/BharatRatnaforGhantasala