అమరావతి : ఆంధ్రప్రదేశ్లో సినిమా థియేటర్ టికెట్ల ధరల పెంపుదలపై మరోసారి జనవరి మొదటి వారంలో నిర్వహించాలని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈరోజు హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ నేతృత్వంలో 13 సభ్యులతో ఏర్పాటు చేసిన కమిటీ సమావేశం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు. టికెట్ ధర నిర్ధారణ, థియేటర్ల వర్గీకరణ అంశాలపై ఎగ్జిబిటర్లు.. డిస్ట్రీబూటర్లు, నిర్మాతల విజ్ఞప్తులను పరిశీలించిన కమిటీ కొన్ని అంశాలను మాత్రమే చర్చించి సమావేశాన్ని వాయిదా వేసింది.
టికెట్ల పెంపు వ్యవహారంలో అన్ని వర్గాలతో చర్చించి నిర్ణయం తీసుకుందామని, పెద్ద సినిమాలు వస్తున్నాయని హడావుడిగా నిర్ణయాలు తీసుకోవద్దని కమిటీ విజ్ఞప్తి చేసింది . వచ్చే నెల మొదటివారంలో వర్చువల్ విధానంలో కాకుండా ప్రత్యక్షంగా సమావేశం అవ్వాలని నిర్ణయించింది .