తిరుమల : తిరుమలలో భక్తులకు అన్నదానం పేరిట విరాళాలు అందజేస్తామని వచ్చే ప్రైవేట్ సంస్థలకు విరాళాలలు ఇవ్వొద్దని టీటీడీ అధికారులు కోరారు. ఇలా కొన్ని సంస్థలు పెద్ద ఎత్తున్న విరాళాలు సేకరిస్తున్న ట్లు తమకు ఫిర్యాదులు అందుతున్నాయని అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సికింద్రాబాద్ అనంతగోవిందదాస ట్రస్టుతో టీటీడీకి ఎలాంటి సంబంధం లేదని వెల్లడించా రు. ఈనెల 26 నుంచి ప్రారంభం కానున్న శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఉచితంగా అన్నప్రసాదం అందజేస్తున్నామని తెలిపారు.
తిరుమల కొండపై ఇవాళ ఆదివారం సెలవు కారణంగా భక్తుల రద్దీ పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లు అన్నీ నిండిపోయాయి. ఎంటీవీ అన్నప్రసాద భవనం వరకు భక్తులు క్యూ లైన్లలో వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనం కోసం దాదాపు 20 గంటలకు పైగా సమయం పడుతుందని అధికారులు చెప్పారు.
రూ.300 ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన వారు స్వామి వారి దర్శించుకునేందుకు మూడు, నాలుగు గంటల సమయం పట్టనున్నది. నిన్న తిరుమల శ్రీవారిని 82,392 మంది భక్తులు దర్శించుకోగా వీరిలో 41,800 మంది తలనీలాలను సమర్పించుకుని మొక్కులు తీర్చుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.59 కోట్లు వచ్చిందని అధికారులు వెల్లడించారు.