అమరావతి : సమాజంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలగాలని, తప్పులు చేసి పాపాత్ములుగా మిగలవద్దని నారా భువనేశ్వరి అన్నారు. సోమవారం ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ద్వారా తిరుపతిలో 48 మంది వరద బాధితులకు లక్ష చొప్పున ఆర్థిక సహాయాన్ని ఆమె అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. విపత్తుల సమయంలో బాధితులకు అండగా నిలువాలని, వారికి సహాయ సహకారాలు అందించి మానవత్వాన్ని కాపాడాలని సూచించారు. తన తండ్రి ఎన్టీఆర్ పేదలను ఆదుకోవడంలో ముందంజలో ఉండే వారని గుర్తు చేశారు. ఆయన బాటలో తామంతా నడుస్తున్నామని అన్నారు.
వైసీపీ నేతల విమర్శలు పట్టించుకోమని, బాధపడమని అన్నారు. తనపై వ్యాఖ్యలు చేసిన వారు వాళ్ల పాపాన వాళ్లే పోతారని వ్యాఖ్యనించారు. నోటికొచ్చినట్లు ఆడవాళ్లపై మాట్లాడొద్దని, సమాజానికి ఉపయోగం లేని విమర్శలెందుకని అన్నారు. అతిపెద్ద రాష్ట్రాన్ని నా భర్త ఏ విధంగా అభివృద్ధి చేశారో నాకు తెలుసని, రాత్రింబవళ్లు నిద్రలేకుండా పని చేశారని ఆమె పేర్కొన్నారు. రాష్ట్ర రాజధానిగా అమరవతే ఉండాలని వెల్లడించారు.