తిరుపతి : తిరుమల( Tirumala) , తిరుపతి దేవస్థానం పరిధిలోని స్థానిక ఆలయాల్లో ఈనెల 20న దీపావళి ఆస్థానాన్ని (Diwali Asthanam) నిర్వహిస్తున్నట్లు టీటీడీ (TTD ) ఆలయ అధికారులు వివరించారు. స్థానిక ఆలయాలైన తిరుపతి గోవిందరాజస్వామివారి ఆలయం, కోదండరామస్వామివారిఆలయం, కార్వేటినగరం వేణుగోపాలస్వామివారి ఆలయాల్లో శాస్త్రోక్తంగా ఆస్థానం నిర్వహించనున్నట్లు వివరించారు.
గోవిందరాజస్వామి ఆలయ ప్రాంగణంలోని శ్రీ పుండరికవళ్ళి అమ్మవారి ఆలయం నుంచి సాయంత్రం 5.30 నుండి 6.30 గంటల మధ్య నూతన వస్త్రాలు, దీపాలు తీసుకువచ్చి స్వామివారికి సమర్పణ అనంతరం దీపావళి ఆస్థానం నిర్వహించనున్నట్లు వివరించారు. కోదండరామస్వామి ఆలయంలో రాత్రి 7 నుంచి 8 గంటల వరకు దీపావళి ఆస్థానం జరుగుతుందన్నారు.
తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం నుంచి నూతన వస్త్రాలు, దోశపడి, దీపాలు తీసుకువచ్చి కోదండరామస్వామివారికి సమర్పిస్తారని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించే సహస్ర కలశాభిషేకంసేవ, హనుమంత వాహనసేవను రద్దు చేసినట్లు పేర్కొన్నారు. కార్వేటినగరం వేణుగోపాలస్వామివారి ఆలయంలో సాయంత్రం 5 గంటలకు దీపావళి ఆస్థానం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా ఉదయం 8 నుంచి 9 గంటల వరకు రుక్మిణి, సత్యభామ సమేత వేణుగోపాలస్వామి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం జరుగనుందని వివరించారు. సాయంత్రం 5 నుండి 6.30 గంటల వరకు తిరువీధి ఉత్సవం వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.