అమరావతి : శిక్షణలో ఉన్న ఓ డిప్యూటీ తహసీల్దార్.. మహిళా డిప్యూటీ కలెక్టర్ గదిలోకి అర్ధరాత్రి సమయంలో వెళ్లేందుకు యత్నించాడు. డిప్యూటీ కలెక్టర్ అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించింది. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు జిల్లాలోని ఏపీ హెచ్ఆర్డీఐ శిక్షణా కేంద్రంలో డిప్యూటీ తహసీల్దార్గా సతీశ్ అనే యువకుడు శిక్షణ తీసుకుంటున్నాడు. అదే కేంద్రంలో ఓ మహిళా డిప్యూటీ కలెక్టర్గా శిక్షణ తీసుకుంటుంది. అయితే ఆమె నివాసముంటున్న వీకేఎన్కే అపార్ట్మెంట్ వద్దకు సతీశ్ సోమవారం అర్ధరాత్రి వెళ్లాడు. ఆ తర్వాత డిప్యూటీ కలెక్టర్ గది తలుపులు కొట్టాడు. అప్రమత్తమైన ఆమె 112కు ఫోన్ చేశారు. దీంతో మంగళగిరి గ్రామీణ ఎస్ఐ రమేశ్ బాబు తన సిబ్బందితో ఘటనాస్థలికి చేరుకుని డిప్యూటీ తహసీల్దార్ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.