అమరావతి : ఆంధ్రప్రదేశ్లో చింతామణి నాటకం నిషేధంపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. నాటకాన్ని నిషేధించడంపై ఎంపీ రఘురామ కృష్ణరాజు హైకోర్టును ఆశ్రయించారు. నాటకాన్ని నిషేధించడం వాక్స్వేచ్ఛను హరిచండమేనని రఘురామ తరుఫు న్యాయవాది ఉమేశ్ వాదించారు. నాటకాన్ని నిషేధించడం వల్ల పలువురు ఉపాధి కోల్పోయారని ఆయన పేర్కొన్నారు.
అయితే ఈ వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. స్టే పై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. నాటకం అసలు వెర్షన్ సమర్పించాలని పిటిషనర్కు హైకోర్టు సూచించింది. కేసు తదుపరి విచారణ ఆగస్టు 17కు వాయిదా వేసింది.
వంద సంవత్సరాల చరిత్ర కలిగిన చింతామణి నాటకం ప్రదర్శనలో ఒక సామాజిక వర్గాన్ని కించిపరిచే విధంగా ఉందంటూ ఆర్యవైశ్య ప్రతినిధులు 2020లో కోర్టుకు వెళ్లగా 2022 జనవరిలో ఏపీ ప్రభుత్వం ఆ నాటకాన్ని నిషేధించింది. ఈ నిషేధంపై ఎంపీ రఘురామ కోర్టును ఆశ్రయించగా ఇవాళ కోర్టు స్టేకు నిరాకరించింది.