అమరావతి : ఈ నెల 17న తిరుపతిలో నిర్వహించనున్న అమరావతి రైతుల బహిరంగ సభకు పోలీసులు అనుమతిని నిరాకరించారు. ఆంధ్రప్రదేశ్కు ఏకైక రాజధాని అమరావతిని కొనసాగించాలంటూ ఆ ప్రాంత రైతులు న్యాయస్థానం నుంచి దేవస్థానం(తిరుపతి) వరకు చేపట్టిన మహాపాదయాత్ర శనివారం 41వ రోజుకు చేరుకుంది. అయితే ముగింపు రోజున(17)న తిరుపతిలో బహిరంగ సభ నిర్వహణకు అనుమతించాలని వారం రోజుల క్రితమే అమరావతి జేఏసీ ప్రతినిధులు చిత్తూరు ఎస్పీని కలిసి వినతి పత్రం అందజేశారు.
తాజాగా పోలీసులు అనుమతిని నిరాకరించడంతో జేఏసీ ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే కోర్టు అనుమతి, ఆదేశాల మేరకు శాంతియుతంగా పాదయాత్ర నిర్వహిస్తున్నామని, అదే తరహాలో తాము బహిరంగ సభకు అనుమతి ఇవ్వాలని కోరారు. లేని పక్షంలో హైకోర్టును ఆశ్రయిస్తామని వారు వెల్లడించారు. శనివారం శ్రీకాకుళం నుంచి బయలుదేరిన పాదయాత్ర ఈ రోజు 17 కిలోమీటర్ల వరకు కొనసాగనుంది. ఈ సందర్భంగా స్థానిక మహిళలు, రైతులు అమరావతి రైతులకు సంఘీభావం ప్రకటించారు. పసుపు, కుంకుమ, తాంబూలం ఇచ్చి ప్రోత్సహించారు. ఈ యాత్రకు మహారాష్ట్రలోని పుణె, పింప్రి చించువాడ్, బోసారి ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు మద్దతు తెలిపారు.