అమరావతి : చరిత్ర పుస్తకాల్లో రాక్షసుల పాలనను చదువుకున్నట్లు ఏపీలో నేడు రాక్షసపాలన, సైకో పాలన కొనసాగుతుందని హిందూపురం ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ (MLA Balakrishna) ఆరోపించారు. శ్రీసత్యసాయి జిల్లా(Satyasai District) పెనుకొండలో టీడీపీ (TDP) ఆధ్వర్యంలో నిర్వహించిన ‘రా.. కదలిరా’ బహరింగ సభలో ఆయన మాట్లాడారు. రాజధాని లేని రాజ్యం దేశంలో ఎక్కడా లేదని విమర్శించారు.
వైఎస్ జగన్ పాలనలో ధరలు విపరీతంగా పెరిగాయని, దేశంలో డ్రగ్స్(Drugs) , గంజాయి విక్రయంలో ఏపీ నంబర్వన్ స్థానంలో ఉందని ఆరోపించారు. వైసీపీకి చెందిన ల్యాండ్, స్యాండ్ మాఫియా వేల కోట్ల రూపాయలను దోచుకుంటుందని విమర్శించారు. ఐదేళ్లు పూర్తవుతున్నా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయలేదని అన్నారు. అప్పులు చేయకుంటే ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు.
ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కును కాపాడుకోవడంలో ప్రభుత్వం విఫలమయ్యిందని అన్నారు. అన్ని వర్గాలకు ఇబ్బందులకు గురిచేస్తూ వైశాచిక ఆనందం పొందుతుందని విమర్శించారు. టీడీపీ హయాంలో భారీ పరిశ్రమలు వచ్చాయని, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరిగాయని అన్నారు. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే పెద్ద బలమని ఆయన అన్నారు.