తిరుమల : తిరుపతిలోని గోవిందరాజస్వామివారి ఆలయంలో నవంబర్ 4న దీపావళి సందర్భంగా ఆస్థానం జరుగనుంది. ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణంలోని పుండరికవల్లి అమ్మవారి ఆలయం నుంచి నూతన వస్త్రాలు, దీపాలు తీసుకువచ్చి స్వామివారికి సమర్పిస్తారు. అనంతరం ఆలయంలో దీపావళి ఆస్థానం నిర్వహించనున్నారు. దీపావళి ఆస్థానం సందర్భంగా నవంబర్ 2న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనున్నది.
ఉదయం 6.30 నుంచి 8.30 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అని వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.