తిరుపతి : శ్రీనివాసమంగపురం కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో (Brahmotsavam) నాలుగో రోజు ఆదివారం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసుడు రాజగోపాలస్వామివారి అలంకారంలో కల్పవృక్ష (Kalpavriksha) వాహనంపై నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. సాయంత్రం ఊంజల్సేవను వైభవంగా నిర్వహించి సర్వభూపాలవాహనంపై ఊరేగించారు.
రేపు కల్యాణ వేంకటేశ్వరస్వామి గరుడసేవ
వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు సోమవారం రాత్రి గరుడ(Garuda Seva) వాహనసేవను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా శ్రీవారి గరుడసేవకు ఆలయంలో టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసిందన్నారు. ఆలయంలో ప్రత్యేక పుష్ప, విద్యుత్ దీపాలంకరణలు పూర్తి చేశామని అన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విజిలెన్స్, పోలీస్ విభాగాల సమన్వయంతో ట్రాఫిక్కు ఇబ్బందులు లేకుండా వాహనాల పార్కింగ్ తో పాటు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు.