తిరుపతి : శ్రీనివాసమంగాపురం కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు శనివారం శ్రీనివాసుడు యోగనరసింహుడి అలంకారంలో సింహ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. వాహనం ముందు వృషభాలు, గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తించారు.
మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. శనివారం రాత్రి 7 నుంచి 8 గంటల వరకు స్వామివారు ముత్యపుపందిరి వాహనంపై కటాక్షిస్తారని అధికారులు తెలిపారు.
సూర్యప్రభ వాహనంపై కపిలేశ్వరస్వామివారి కటాక్షం
కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు శనివారం కపిలేశ్వర స్వామివారు సూర్యప్రభ వాహనంపై దర్శనమిచ్చారు. అనంతరం స్నపన తిరుమంజనం ఘనంగా జరిగింది. స్కోమస్కందమూర్తి, ఽకామాక్షి దేవి అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, పండ్లరసాలు, చందనంతో అభిషేకం చేశారు.