Cyclone Montha | ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం వేగంగా కదులుతోంది. గడిచిన 6 గంటల్లో 5 కి.మీ. వేగంతో కదిలిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రఖర్ జైన్ తెలిపారు. రాబోయే 12 గంటల్లో తుపాన్గా బలపడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఎల్లుండి ఉదయానికి తీవ్ర తుపాన్గా మారే అవకాశం ఉందని హెచ్చరించారు.
ప్రస్తుతాని చెన్నైకి 770 కి.మీ., విశాఖపట్నానికి 820 కి.మీ., కాకినాడకు 820కి.మీ. దూరంలో కేంద్రీకృతమైందని ప్రఖర్ జైన్ చెప్పారు. మచిలీపట్నం-కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో ఇది తీరాన్ని దాటే అవకాశం ఉందని అన్నారు. తుపాన్ నేపథ్యంలో రేపు, ఎల్లుండి కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. రేపు కాకినాడ, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, విశాఖ, అల్లూరి, అనకాపల్లి, తూర్పు గోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, నంద్యాల, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, మిగతా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. బలమైన ఈదురుగాలులు వీస్తాయని.. ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని సూచించారు.
ఎల్లుండి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని ప్రఖర్ జైన్ తెలిపారు. కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.