అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సెటైర్ వేసి విమర్శించారు. పాత పరిశ్రమలకే రిబ్బన్లు కటింగ్ చేయడమేంటి? అని ప్రశ్నించారు. ఇది ముమ్మాటికీ రాష్ట్ర ప్రజలను వంచించడమే అన్నారు. ఏపీలో ఎలక్ట్రానిక్ హబ్ అభివృద్ధి అంతా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి వల్లేనని చెప్పారు.
తిరుపతి పర్యటనలో ఉన్న సీఎం జగన్ పలు పరిశ్రమలను ప్రారంభించారు. దీనిపై నారా లోకేష్ తీవ్రంగా విమర్శించారు. గతంలో ఉన్న పరిశ్రమలకే జగన్ రిబ్బన్ కటింగ్లు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. జగన్ విడుదల చేసిన పోస్టర్లో ఏ ఒక్క కంపెనీ కూడా ఆయన తెచ్చింది కాదన్నారు. ఆ విషయం తనకు తెలిసినప్పటికీ తెలియనట్లుగా నటిస్తున్నాడని దుయ్యబట్టారు. వాటిని తానే తెచ్చినట్లు జగన్ ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉన్నదన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎలక్ట్రానిక్ హబ్గా మార్చేందుకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన కృషి ఫలితంగానే పలు కంపెనీలు ఏపీకి వచ్చిన విషయం మర్చిపోవద్దని లోకేష్ అన్నారు. తిరుపతి ఎలక్ట్రానిక్స్ హబ్లో పరిశ్రమలను ప్రారంభించి మరోసారి అడ్డంగా జగన్ బుక్కయ్యాడని లోకేష్ విమర్శించారు. ఇలాంటి చవకబారు ప్రచారాలను జగన్ మానుకుంటే మంచిదని హితవు పలికారు.