Srisailam | శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల మహా పుణ్య క్షేత్రం భక్తులతో కిక్కిరిసి పోయింది. కార్తీక మాసం పరమ శివుని దర్శనానికి ఉభయ తెలుగు రాష్ట్రాలతోపాటు ఉత్తర దక్షిణాది రాష్ట్రాల నుండి వచ్చిన యాత్రికులు తెల్లవారు జాము నుండి క్యూ లైన్లలో బారులు దీరారు. తెల్లవారు జుమున కృష్ణా నదిలో పుణ్య స్నానాలు చేసుకుని పసుపు కుంకుమలతో సారె సమర్పించి, కార్తీక దీప దానాలు చేశారు.
భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో భక్తులకు శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి రెండు గంటల సమయం పట్టిందని శ్రీశైలం దేవస్థానం అధికారులు తెలిపారు. చండీహోమం, రుద్రయాగం, నిత్యకళ్యాణంలో భక్తులు పాల్గొన్నారు.
కార్తీక మాసం ప్రత్యేకంగా వీర శిరోమండపంలో ఓం నమ: శివాయ ప్రణవ పంచాక్షరీ మంత్రాన్ని భజన బృందాలు పఠించారు. భక్తుల ఆధ్వర్యంలో చతుస్సప్తాహ అఖండ భజనలు జరుగుతున్నాయి. ఆలయ ఉత్తర మాఢవీధితోపాటు గంగాధర మండపం, ఉత్తర మాడవీధిలో మహిళలు అధిక సంఖ్యలో కార్తీక దీపాలను వెలిగించుకున్నారు.
శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల ప్రధానాలయ ప్రాకారంలోని త్రిఫల వృక్షం క్రింద కొలువైన దత్తాత్రేయస్వామికి గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఈఓ పెద్దిరాజు తెలిపారు. లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ ఉదయం వేద పండితులు శాస్త్రోక్తంగా అభిషేకార్చనలు జరిపించారు.