తిరుమల : తిరుమల (Tirumala) లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కంపార్టుమెంట్లు నిండిపోయాయి. ఏటీజీహెచ్ వరకు భక్తులు క్యూలైన్లో నిలబడ్డారు. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుందని టీటీడీ(TTD) అధికారులు వివరించారు.
నిన్న స్వామివారిని 72,986 మంది భక్తులు దర్శించుకోగా 33,482 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 2.79 కోట్లు వచ్చిందని తెలిపారు.
తెప్పపై మలయప్పస్వామి దర్శనం
తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాల్లో నాలుగో రోజు శనివారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామి (Malayyap Swamy) తెప్పపై భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులను శ్రీవారి ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగించి శ్రీవారి పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు. విద్యుద్దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన తెప్పపై వారిని ప్రతిష్టించి పుష్కరిణిలో ఐదు చుట్లు విహరించి భక్తులకు అనుగ్రహం కల్పించారు.