విజయవాడ: విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను నిరసిస్తూ ఉద్యోగులు, యూనియన్ నేతలు చేస్తున్న దీక్షలు 500 రోజులు పూర్తయ్యాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని అటు విశాఖలో ఉద్యోగులు, వీఎస్పీ జేఏసీ నేతలు.. ఇటు విజయవాడలో సీపీఐ నేతలు ర్యాలీ చేపట్టి తమ నిరసనను వ్యక్తపరిచారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటుపరం కానివ్వమంటూ ఉద్యోగులు శపథం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు.
వీఎస్పీ ప్రైవేటీకరణ చర్యను నిరసిస్తూ విజయవాడలో భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) కార్యకర్తలు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా జరిగిన సభలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ ప్రసంగిచారు. విశాఖ ఉక్కు కర్మాగారం కోసం పెద్దఎత్తున ఉద్యమించి 32 మంది ప్రాణత్యాగం చేసి సాధించుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రజల ఆకాంక్షలను పట్టించుకోకుండా ప్రైవేటీకరణ చేసేందుకు మోదీ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తున్నదని ఆరోపించారు.
ఒక్క ప్రభుత్వ రంగ పరిశ్రమను కూడా స్థాపించడంలో బీజేపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, అయితే, 26 ప్రభుత్వ రంగ సంస్థలను విక్రయించడానికి ప్రయత్నించడం సిగ్గుచేటన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను అంబానీలు, అదానీలకు పెద్దపీట వేసి అప్పగిస్తున్నదని ఆరోపించారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఉద్యోగుల సుదీర్ఘ పోరాటం చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోతుందని, అన్ని కార్మిక సంఘాలు, ప్రజాసంఘాలు ఒకే వేదికపైకి వచ్చి ఆందోళనలు చేయడం శుభసూచకమన్నారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు అక్కినేని వనజ, జీ కోటేశ్వరరావు, డీవీ రమణబాబు, తాడి పైడయ్య, అప్పురుబోతు రాము, కేవీ భాస్కరరావు, కొట్టు రమణరావు, తూణం వీరయ్య, కే ఆనందరావు, పంచదార్ల దుర్గాంబ, దుర్గాసి రమణమ్మ, తమ్మిన దుర్గ, ఎంఎఐవైఎఫ్ నాయకులు పెయ్యల ప్రుధ్వీన్, లంకె సాయి, ఎఐఎస్ఎఫ్ నాయకులు ఓబులేసు, ఎం సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు.